2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 113 డాలర్లు. అప్పుడు దేశీయంగా లీటరు పెట్రోలు ధర రూ.71గా ఉంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 85 డాలర్లు. ఈ లెక్కన లీటరు పెట్రోలు ధర రూ.50కి అటూ ఇటూగా ఉండాలి. అయితే, ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 107గా ఉన్నది.
అంటే లీటర్ పెట్రోల్ ధర ఉండాల్సిన దానికంటే రూ. 57 ఎక్కువగా ఉన్నది. దీనిని బట్టి కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్యులపై ఎలా ధరాఘాతం మోపుతున్నదో అర్థంచేసుకోవచ్చు.
BJP | హైదరాబాద్, మే 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పదేండ్ల బీజేపీ ప్రభుత్వహయాంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 71గా ఉంటే ప్రస్తుతం ఇది రూ. 107కు పెరిగింది. అప్పుడు రూ. 55గా ఉన్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు రూ. 95కు చేరింది. ఇండ్లల్లో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ. 399కే లభించగా.. ఇప్పుడు రూ. 855 ఖర్చుచేసినా దొరకని పరిస్థితి. వెరసి మోదీ ప్రభుత్వహయాంలో పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు కుదేలవుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోవాతపెట్టిన మోదీ సర్కారు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించట్లేదు. దీంతో సామాన్యులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. వివరంగా చెప్పాలంటే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రో ధరలు తగ్గాలి. కానీ కేంద్రం ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్నది. దీనికోసం ఎక్సైజ్ డ్యూటీ పేరిట అదనపు సుంకాలను విధిస్తున్నది. గడిచిన పదేండ్లలో కేంద్రం పెట్రోల్పై 109.91 శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, డీజిల్పై ఏకంగా 343.82 శాతం పన్ను పెంచింది. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాలు చెప్తున్నాయి. ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు.