Temperatures | మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో.. జనాలు ఆందోళనకు గురవుతున్నారు. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
అయితే మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నప్పటికీ.. త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. 4 నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ప్రతి ఏడాది ఈ సమయానికి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే.. ప్రస్తుత ఉష్ణోగ్రతలు అధికమే అని ఐఎండీ తెలిపింది.
తాజా ఉష్ణోగ్రతలను అంచనా వేసి.. ఈ వేసవి మొత్తం ఎండలు అధికంగా ఉంటాయని చెప్పలేమని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. భూ వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించారు. ఇక మైదాన ప్రాంతాల్లో 40 కంటే ఎక్కువ, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వడగాలులు వీస్తున్నట్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు.