నమస్తే తెలంగాణ నెట్వర్క్: గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశా యి. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని బొటాడ్ జిల్లాలోని లింబాడియా గ్రామంలో ఇటీవల నలుగురు దళిత మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఓ అగ్రవర్ణ మహి ళ అడ్డుకున్నది. ఈ కేసులో ఆ మహిళను అరె స్టు చేయించారనే ప్రతీకారంతో దళితులను ఆ గ్రామం నుంచే బహిష్కరించారు. ఈ అమానవీయ ఘటనను యావత్ తెలంగాణ తీవ్రం గా ఖండించింది. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనంచేశాయి. రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట, వరంగల్ ఎంజీఎం దవాఖాన కూడలి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి, వేములవాడ అంబేద్కర్ విగ్రహ కూడలి, జగిత్యాల తాసిల్దార్ చౌరస్తా, కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధరలో, పెద్దపల్లి జిల్లా మంథనితోపాటు ధర్మారం, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, వెల్గటూర్, గొల్లపల్లిలలో టీఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాలు, యువజన సంఘాలు మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశాయి.
భగ్గుమన్న నేతలు
గుజరాత్లో దళితులపై లైంగికదాడులు, హత్యలు కుల దురహంకారానికి నిదర్శనమని సీనియర్ జర్నలిస్టు, బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెష ల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మండిపడ్డారు. మోదీ సీఎంగా ఉన్న సమయం నుంచే దళితులపై దాడులు పెరుగుతూ వస్తున్నాయన్నారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టాక దళిత మహిళలపై లైంగికదాడులు, హత్యల సంఖ్య పది రెట్లు పెరిగిందన్నారు. ఇప్పటికీ గుజరాత్లోని 90శాతం దేవాలయాల్లో దళితులకు ప్రవేశం లేదన్నారు. గుజరాత్లో దళితులకు జరిగిన అవమానాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. దళితుల పట్ల అగ్రవర్ణాలు ఇంత దారుణంగా వ్యవహరించడం, దానికి గుజరాత్లోని అధికార పార్టీ అండగా నిలవడం సిగ్గుచేటు అని తెలంగాణ ఎస్సీ జేఏసీ ప్రతినిధి ధీరన్ అన్నారు. మోదీ ప్రభు త్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నా రు. ఈ దారుణం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాకు కనిపించడం లేదా అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండారు వీరబాబు ప్రశ్నించారు. దళితులపై దాడులకు నైతిక బాధ్యత వహించి గుజరాత్ సీఎం, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో దళితుల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు.
దళితులపై బీజేపీ వివక్ష: వంగపల్లి
ముషీరాబాద్, ఆగస్టు 30: ఎనిమిదేండ్లలో మోదీ సర్కా రు దళితుల అభివృద్ధి కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టకపోగా, దళితుల పట్ల వివక్ష పెంచుతున్నదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో దళితులపై దాడులు, లైంగికదాడులు పెరిగిపోయాయని అన్నా రు. బీజేపీ సిద్ధాంతంలోనే మనువాదం ఉన్నదని, అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జై శ్రీరామ్ అనకపోతే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవా రం విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో దళిత మహి ళ కనీసం ఆలయ ప్రవేశం చేయలేని దారుణ పరిస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, నాగరాజు, చింతం తిరుపతి, జన్నారపు జీవన్, కానుగంటి సురేశ్, కిరణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.