CM KCR | కిసాన్ సర్కార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచి సామాజిక బాంధవ్యమని, మహారాష్ట్ర అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నామన్నారు. మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించడం ఆనందంగా ఉందని, తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రను కూడా ప్రగతిపథంలో నడిపించుకుందామన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని, మహారాష్ట్రలో చీలికల పేచీలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాలన్నారు. పరివర్తన చెందిన భారతదేశంతోనే అభివృద్ధి సాధ్యమని, దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. ఇతర దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి.. మన దేశ పరిస్థితి ఎట్ల ఉందని, దేశ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అవసరానికి మించి అందుబాటులో ఉన్న నదీజలాలు, తదితరాలను దేశ పాలకులు సరైన రీతిలో వినియోగించలేకపోతున్నారని, అంతర్జాతీయ మార్కెట్ భారతదేశ ఇజ్జతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి నిరోధకులకు ఓట్లు వేసుకుంటూ ఇంకెన్నాళ్లు అభివృద్ధి దూరంగా ఉండాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి గడప ముందు నిలబడ్డదన్నారు. కిసాన్ సర్కార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామని, తెలంగాణలో జరిగినట్టు మహారాష్ట్రలో ప్రగతి ఎందుకు సాధ్యం కాదో చూద్దామన్నారు. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణ అభివృద్ధిని చూసేందుకు తెలంగాణలో పర్యటించాలని నేతలకు సూచించారు.
అందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తామని చెప్పారు. త్వరలో సోలాపర్లో ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీని నిర్వహిస్తామని, 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించుకుందామన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధిని మహారాష్ట్రలో చేసి చూయించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. మీ భవిష్యత్కు భరోసా బీఆర్ఎస్ పార్టేనని, బీఆర్ఎస్ను గెలిపిస్తే మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. దేశంలోని పాలకులు వ్యవసాయరంగానికి సబ్సిడీని వ్యతిరేకించడం శోచనీయమన్నారు. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశ రైతాంగాన్ని రక్షించుకుందామని పిలుపునిస్తూ.. దేశంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసుకుందామని పునరుద్ఘాటించారు.