లాలూ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. పార్టీ సభ్యత్వానికి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రతి సారీ జోక్యం చేసుకున్నట్లుగా తేజస్వీ యాదవ్, రబ్రీ దేవి ఈ సారి జోక్యం చేసుకోవడం లేదు. కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ వ్యవహారం మొత్తం లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టులోకి వెళ్లిపోయింది. రాజీనామా వ్యవహారంపై లాలూయే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే తేజ్ ప్రతాప్ పై ఆర్జేడీ నేత రామ్ రాజ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఓ గదిలో బంధించి తేజ్ ప్రతాప్ కొట్టారని రామ్రాజ్ ఆరోపించారు. ఈ ఘటనను లాలూ ప్రసాద్ చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తేజ్ ప్రతాప్ రాజీనామా ప్రకటన ఇచ్చారని తెలుస్తోంది. అయితే మొదట్లో ఢిల్లీ వెళ్లి, తన రాజీనామాను లాలూకు సమర్పిస్తానని ప్రకటించారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారు. పాట్నాలోనే ఉంటానని తేజ్ ప్రతాప్ ప్రకటించారు.
అయితే… రాజీనామా చేస్తానని ప్రకటించిన తేజ్ ప్రతాప్.. తన తల్లి రబ్రీ దేవితో ఉన్న ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశారు. తన తల్లి మద్దతు తనకు ఉందన్న సంకేతాలను ఇవ్వాలని చూశారు. అయితే… రాజీనామా వ్యవహారంపై తల్లి రబ్రీదేవి గానీ, సోదరుడు తేజస్వీ యాదవ్ గానీ.. ఇప్పటి వరకూ మాట్లాడలేదు. అయితే సోమవారం లాలూ ప్రసాద్ తేజ్ ప్రతాప్కు ఫోన్ చేసి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది.