IT Rides | జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు (IT Rides) కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ సోదాల్లో రాంచీలోని ధీరజ్ సాహూకు చెందిన ఆఫీసులో మరో మూడు బ్యాగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒడిశాలో జరుగుతున్న దాడుల్లో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న బంటీ సాహూ అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 19 బ్యాగుల్లో సొమ్మును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన బ్యాగుల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగానే నగదు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒడిశాలో దాడులు జరుగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని లెక్కపెట్టేందుకు అధికారులు మూడు డజన్ల కౌంటింగ్ మెషీన్లను వాడుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపుగా రూ.300 కోట్ల మేర సొమ్మును పట్టుబడినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మొదట డిసెంబర్ 6న డిస్టిలరీలపై దాడులు చేపట్టారు. ఆ తర్వాత బల్దియో సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ 156 బ్యాగుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని టిట్లాగఢ్, సంబల్పూర్, సుందర్గఢ్, భువనేశ్వర్, జార్ఖండ్లోని కొన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రూర్కెలా, రాయగడలో కొందరు మద్యం వ్యాపారులకు సంబంధించిన ఆస్తులపై కూడా సోదాలు జరిగాయి.
Also Read..
PM Modi | ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతలు ఎవరంటే..?
NIA Raids | మహారాష్ట్ర, కర్ణాటకలో ఏకకాలంలో 41 చోట్ల ఎన్ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్
KCR | బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక