చెన్నై: తెలతెల్లవారగానే గొంతులో టీ పడకపోతే మనలో చాలా మందికి ఎటూ తోయదు. కొంత మంది టీ తాగకుండా ఏ పనిచేయలేరు. మరికొందరైతే రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతారు. బ్రిటిష్ వాళ్లు అలవాటు చేసిపోయిన టీకి దేశంలో అంత క్రేజ్ పెరిగింది. అందరూ అంతగా ఇష్టపడే టీ తయారీకి అవసరమయ్యే టీ పొడి కూడా పెద్దగా ఖరీదైనదేమీ కాదు. మహా అయితే కేజీ రూ.300 లేదా రూ.400 ఉంటుంది.
కానీ, తమిళనాడులోని నీలగిరిలో సాగయ్యే నీలగిరి సిల్వర్ నీడిల్ వైట్ టీ మాత్రం వేలంలో రికార్డు ధర పలికి సరికొత్త రికార్డు సృష్టించింది. నీలగిరికి దగ్గర్లోనే ఉండే కూనూరులో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ నుంచి విదేశాలకు ఎగుమతి అయిన ఈ సిల్వర్ నీడిల్ టీ.. ఇంటర్నేషనల్ టీ వేలంలో కేజీ రూ.16,400 ధర పలికింది. టీ ఉత్పత్తిలో తమిళనాడులోని నీలగిరికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
ఇక్కడ ఆర్తొడాక్స్ టీ, గ్రీన్ టీ, సిల్వర్ నీడిల్ టీ వంటి రకరకాల టీ పొడులను ఉత్పత్తి చేస్తారు. అంతేగాక ఇక్కడ ప్రభుత్వం అధ్వర్యంలో నడిచే టీ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. వాటితోపాటే 100కు పైగా ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా నడుస్తున్నాయి. నీలగిరి జిల్లాలో 60 వేల మందికి పైగా రైతులు తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే టీ పొడిని కూనూరులో జరిగే ఇంటర్నేషనల్ టీ వేలం కోసం తీసుకెళ్తారు. అక్కడ విదేశాల నుంచి వచ్చే టీ కంపెనీల వారు వేలంలో టీ పొడిని కొంటారు.