చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పుదుచ్చేరి రాష్ట్రం అంతటా, తమిళనాడులో రాజధాని చెన్నైతోపాటు దాని పరిసరాల్లో 22 జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దాంతో రెండు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో కూడా కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తమిళనాడులో వచ్చే ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు చెన్నై సహా 22 జిల్లాలను అప్రమత్తం చేసింది. చెంగల్పేట్, శోలింగనల్లూర్, కేలంబాక్కమ్ నగరాల్లో 4 సెంటీమీటర్ల చొప్పున, అన్నా యూనివర్సిటీ, తంబారమ్ నగరాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా.. మామల్లపురంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
కాగా, ఇవాళ నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండిగుల్, థేని జిల్లాలతోపాటు, రాజధాని చెన్నైలోని తొండియార్పేట్, వేలచేరి, వండల్లూర్, వలజాబాద్, నెమిలి, అరక్కోనమ్ ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.