Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు. కన్యాకుమారి, తిరునేల్వేలి, తూత్తుకుడి, టెన్కాశీ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీ, ఇతర విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు ముమ్మరం చేశారు. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిరాశ్రయులకు పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర నిత్యవసరాలను అందజేస్తున్నారు.
భారీ వరదలు, వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీలు నీట మునిగాయి. విద్యుత్, తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మొబైల్ సిగ్నల్స్ కూడా అందకపోవడంతో స్థానికులు కనీస సమాచారం తెలుసుకోలేకపోతున్నారు.