చెన్నై, ఏప్రిల్ 16: ఎన్నిక ఏదైనా విలక్షణ తీర్పు ఇవ్వడం తమిళుల ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో ఒకే పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టే ఓటర్లు తర్వాతి ఎన్నికల్లో అదే పార్టీని దారుణంగా ఓడించి మరో పార్టీకి గంపగుత్తాగా సీట్లన్నీ అప్పగిస్తారు. జాతీయ పార్టీలను ఆమడదూరంలో పెట్టే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ద్రావిడవాద పార్టీల మధ్యనే పోరు నడిచింది. లోకల్ ఎలక్షైన్లెనా, లోక్సభ ఎలక్షైన్లెనా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్యే పోటీ ఉండేది. తమిళ నేలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల వేలు పట్టుకొని నడుస్తూ వచ్చాయి.
సినీ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాట ఈసారి మాత్రం రాజకీయ సినిమా మారిపోయింది. ఎప్పుడూ ద్విముఖ పోటీనే ఉండే రాష్ట్రంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో 39 స్థానాలకు 38 స్థానాలు గెలిచి క్లీన్స్వీప్ చేసిన డీఎంకే కూటమి ఈసారి కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అన్నా డీఎంకేకు ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా మారాయి. మరోవైపు ఎనిమిది చిన్న పార్టీలను కూడగట్టి మొదటిసారిగా కూటమిని ఏర్పాటు చేసిన బీజేపీ కూడా తమిళనాడుపై చాలానే ఆశలు పెట్టుకున్నది.
గత ఎన్నికల్లో డీఎంకే – కాంగ్రెస్తో కూడిన యూపీఏ కూటమి తమిళనాడులోని 39 స్థానాల్లో 38 స్థానాలను దక్కించుకుంది. ఇండియా కూటమిగా బరిలో దిగుతున్న ఇవే పార్టీలు గత ఎన్నికల ఫలితాలనే మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. దక్షిణాది రాష్ర్టాలకు నిధుల కేటాయింపులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వివక్ష, నీట్ పరీక్షలో తమిళ విద్యార్థులకు అన్యాయం, రాష్ర్టాల హక్కులను కేంద్రం హరించడం, ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తుతూ డీఎంకే ప్రచారం చేస్తున్నది.
అన్నా డీఎంకేకు ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా మారాయి. జయలలిత మరణం తర్వాతి పరిణామాలు, పార్టీలో చీలికలతో అన్నా డీఎంకే బలహీనపడింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కచ్చితంగా రెండో స్థానంలో నిలవాలని, గౌరవప్రదమైన సీట్లు సాధించి పార్టీ ఉనికిని కాపాడుకోవాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే కూటమి గట్టి ప్రయత్నాలనే చేస్తున్నది.
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా బీజేపీ ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర బీజేపీ పగ్గాలు అన్నామలైకి అందించిన తర్వాత ఇక్కడ బీజేపీకి కొంత ఉత్సాహం వచ్చింది. 25 శాతం ఓట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ బరిలో నిలుస్తున్నది.