Tamil Nadu : తమిళనాడు అంటేనే ఉచిత పథకాలకు ప్రసిద్ధి. దేశంలో ఉచిత పథకాల్ని ఎక్కువగా అలవాటు చేసిన రాష్ట్రంగా తమిళనాడుకు గుర్తింపు ఉంది. అందుకే అనేక పార్టీలు తమిళనాట ప్రజలకు ఉచిత పథకాల్ని ప్రకటిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకే పార్టీ కూడా తాజాగా ఉచిత పథకాలతో మేనిఫెస్టో రూపొందించింది.
ఽదీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఉచితంగా ఫ్రిజ్లు అందించనున్నారు. అలాగే, ఐదు లక్షల మంది వర్కింగ్ మహిళలకు టూ వీలర్స్పై సబ్సిడీ అందజేస్తారు. ఒక్కో బైకుకు రూ.25,000 వరకు సబ్సిడీ అందిస్తారు. మంగళవారం ఆ పార్టీ తన మేనిఫెస్టోను చెన్నైలోని కార్యాలయంలో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలోని కీలక అంశాలివి. రేషన్ కార్డ్ కలిగిన పేద కుటుంబాలకు ఉచితంగా ఫ్రిజ్లు. వర్కింగ్ ఉమెన్కు రూ.25 వేల సబ్సిడీపై టూ వీలర్స్. మహిళలతోపాటు మగవారికి కూడా ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణం. రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా ఒక కేజీ పప్పు, ఒక లీటర్ వంట నూనె. అలాగే, అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం. పింఛన్లు రూ.2,000 పెంపు. గ్రామీణ ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంపు. జల్లికట్టు బాధితులకు రూ.10 లక్షల సాయం. ఇలా సామాజిక, ఆర్థిక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తమ మేనిఫెస్టో రూపొందిందని ఏఐఏడీఎంకే తెలిపింది. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.