అహ్మదాబాద్: ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది (IndiGo flight bird hit). దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన 6E-646 విమానం ఆదివారం సూరత్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే సూరత్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆ విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు. ఆ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ విషయాన్ని నిర్ధారించింది. సూరత్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించింది.
కాగా, గత వారం ఢిల్లీ నుంచి ఒడిశాలోని డియోగర్కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్కాల్ ఫేక్ అని తేలింది.
మరోవైపు ఇండిగో, గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన సుమారు 50 విమానాలు గ్రౌండ్ అయ్యాయి. విమానాల ఇంజిన్లు, పరికరాల సరఫరా, హార్ట్వేర్, సాఫ్ట్వేర్ అప్డేట్కు సంబంధించిన అంతరాయం వల్ల భారత్ ఎయిర్లైన్స్లకు చెందిన పలు విమానాలు నిలిచిపోయినట్లు అమెరికాకు చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ (పీ అండ్ డబ్ల్యూ) ప్రతినిధి తెలిపారు.