న్యూఢిలీ, జనవరి 11: అధికార యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నప్పుడు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అధికారి సరిగా పనిచేయనప్పుడు సదరు అధికారిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదా? అని ప్రశ్నించింది. దేశ రాజధానిలో ఢిల్లీప్రభుత్వం, కేంద్రం మధ్య అధికారాల పరిధికి సంబంధించిన వివాదంపై కోర్టు గురువారం విచారణ కొనసాగించింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. దేశ రాజధాని మినీ ఇండియా అని, ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారని చెప్పారు. అధికారుల అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి కేంద్రానికి అధికారాలు ఉంటాయని, వారి పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని వివరించారు. ఎవరైనా అధికారి పనితీరు సరిగా లేకుంటే వారిని మార్చాలని ఎల్జీని కోరవచ్చన్నారు.