రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో తెలియడం పారదర్శక ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనది. అయితే, ఎటువంటి వివరాలు తెలియకుండా ఎన్నికల బాండ్లను స్వీకరించడమనేది పౌరులకు ఉన్న సమాచార హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. ప్రాథమిక హక్కుల అధికరణం 19(1)(ఏ)ను అనుసరించి.. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనది.
– సుప్రీంకోర్టు ధర్మాసనం
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ఆరేండ్ల కిందట కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల (ఎన్నికల బాండ్లు) చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచడం సమాచార హక్కును కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెంటనే నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది.
రాజకీయ పార్టీల నిధుల కోసం తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొప్ప వరం అని మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎస్వై ఖురేషీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇది పునరుద్ధరిస్తుందని చెప్పారు. గత ఐదు-ఏడు ఏండ్లలో సుప్రీం కోర్టు నుంచి వెలువడిన చారిత్రక తీర్పు అని ఆయన పేర్కొన్నారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు.
‘ఎన్నికల నిధుల విధాన ప్రక్షాళనకు మనం ఇంకా సుదూరంగా ఉన్నాం’ అని మాజీ సీఈసీ ఎన్.గోపాల స్వామి తెలిపారు. సంచలన తీర్పు చెప్పిన సుప్రీంకు ‘త్రీ చీర్స్’ అని మరో మాజీ సీఈసీ సునీల్ ఆరోరా అన్నారు.
సుప్రీం తీర్పుపై పలు రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీలకు నిధుల విధానంలో పారదర్శకత ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఈ చర్యపై ఇది నోట్లపై ఓట్ల శక్తిని బలపరుస్తుందని పీసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ పథకం అపారదర్శకం, అప్రజాస్వామికం అని కాంగ్రెస్ పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల నిధుల విధానంలో స్వచ్భమైన, పారదర్శకమైన విధానాన్ని తేవాల్సిన
అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఎన్నికల నిధుల విధానంలో పారదర్శకత తేవడానికే దీనిని ప్రవేశపెట్టినట్టు సమర్థించుకున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం లేని స్థితిలో విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి నళిని కొహ్లీ ఆరోపించారు.
ఎలక్టోరల్ బాండ్లు ప్రామిసరీ నోట్ లాంటివి. భారత్కు చెందిన వ్యక్తులు లేదా కంపెనీలు తగిన రుసుము చెల్లించి వీటిని కొనుగోలు చేసి నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. పార్టీలు ఈ బాండ్లను నగదుగా మార్చుకోవచచ్చు.
2018, జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాలను, వాటిని ఇచ్చిన దాతల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనికోసం ఆర్థిక చట్టం-2017 ద్వారా పలు సవరణలు
చేసింది. దీంతో ఎలక్టోరల్ బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కాంగ్రెస్, సీపీఎం సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశాయి.
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజులలో ఎలక్టోరల్ బాండ్లను ఎస్బీఐ జారీ చేస్తుంది. ఆ సమయంలోనే వీటిని కొనుగోలు చేయాలి. వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు గుణిజాలలో ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్లు కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు దాతలు వీటిని తమకు నచ్చిన పార్టీకి అందించాల్సి ఉంటుంది. అలా వచ్చిన బాండ్లను రాజకీయ పార్టీలు..
ధృవీకరించబడిన ఖాతా ద్వారా మాత్రమే నగదుగా మార్చుకోగలవు. బాండ్లపై దాత పేరు ఉండదు. ఆ వివరాలు బ్యాంకు దగ్గర గోప్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ ఎస్బీఐ 30 విడుతల్లో దాదాపు 28 వేల ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల స్వీకరణ పద్ధతి యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఆస్ట్రేలియా, అమెరికా వంటి అగ్రదేశాల్లో కూడా ఉన్నది. అయితే, విరాళాలు సేకరించే రాజకీయ పార్టీలు.. దాతల పేర్లు, ఎంత మొత్తం అందుకొన్నారు? వంటి వివరాలను విధిగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, విరాళాలకు కూడా పరిమితి విధించారు.