హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాబరీ మినిస్టర్గా మారారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. తన శాఖలో జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి కాక ముందు పొంగులేటి ఆస్తులెంత? ఇప్పుడు ఆయన ఆస్తులెంత? అని ప్రశ్నించారు. పొంగులేటి తన ఆస్తులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఓ రియల్ ఎస్టే ట్ సంస్థ నుంచి రాఘవ కంపెనీకి రూ.15 వేల కోట్లు బదిలీ అయిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కోకాపేటలో 61 అంతస్తుల భవ నం, హైటెక్ సిటీలో షాపింగ్ కాంప్లెక్స్ను బదిలీ చేసుకొన్న మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. బిల్డర్ల నుంచి తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరలో ఆ దందాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పొంగులేటి ప్రభుత్వ కాంట్రాక్టులతోపాటు భూములనూ వదలడం లేదని ఆరోపించారు. ప్రజల ఆస్తులను 22ఏలో పెట్టి సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏలో పెట్టిన సామాన్యుల భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.