న్యూఢిల్లీ: కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ధార్మిక వస్త్రాలు ధరించవద్దు అని హిజబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో ఓ పిల్ వేశారు. తక్షణమే ఆ పిల్ను విచారణకు స్వీకరించాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సరైన సమయంలోనే ఆ అంశంపై విచారణ చేపడుతామని సుప్రీం తెలిపింది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తుది తీర్పు ఇచ్చే వరకు వేచి ఉండాలన్నారు. హిజబ్ సమస్యను జాతీయ స్థాయి సమస్యగా చూడవద్దు అని లాయర్లకు సుప్రీం సీజే ఎన్వీ రమణ సూచించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కర్నాటకకు చెందిన ఓ అమ్మాయి సుప్రీంలో పిల్ దాఖలు చేసింది.