న్యూఢిల్లీ : బుల్డోజర్లతో యూపీ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్ధానం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధంగా కూల్చివేతల చర్యలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుల్డోజర్లతో ఆక్రమణల కూల్చివేతపై యూపీ ప్రభుత్వం మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. యూపీ ప్రభుత్వం ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తులను నేలమట్టం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు ఆరోపించారు. చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండా ఇక ముందు కూల్చివేతలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జమైతే ఉలేమా హింద్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. చట్ట నిబంధనలకు లోబడే కూల్చివేత డ్రైవ్ను చేపట్టామని, బుల్డోజర్లతో ఆక్రమణలను కూల్చివేసే ముందు నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
అయితే తాము యూపీ ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలని కోరడం లేదని, ఎలాంటి చర్యలైనా చట్ట పరిధిలో ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ అభ్యంతరాలను తెలిపేందుకు ప్రభుత్వానికి సమయం ఇస్తామని, ఆలోగా పిటిషనర్ల భద్రతనూ తాము కాపాడాలని తెలిపింది. వారు (పిటిషనర్లు) కూడా సమాజంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. కూల్చివేతలు చట్ట పరిధిలో సాగాలని నొక్కిచెప్పిన కోర్టు విచారణను మరుసటి వారానికి వాయిదా వేసింది. ఇక సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ జహంగిర్పురిలో ఆస్తుల యజమానులు ఏ వర్గం వారు అని చూడకుండా అలాంటి కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసిందని గుర్తుచేశారు.