Adani Group | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అదానీ గ్రూపు సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులను ఇవ్వబోమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అదానీ సంస్థలపై కథనాన్ని ప్రచురించిన హిండెన్బర్గ్ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్, ఆ సంస్థ భారతీయ ప్రతినిధులపై విచారణ జరిపేలా స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదానీ లిస్టెడ్ కంపెనీలపై సెబీ ధృవీకరించనిదే వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా గాగ్ ఆర్డర్ కూడా ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. శుక్రవారం ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూద్.. మీడియాకు వ్యతిరేకంగా ఎలాంటి నిషేధాజ్ఞలు ఇవ్వబోమని స్పష్టం చేశారు.