Supreme Court | గంగా, యమునా నదుల ప్రక్షాళన, పునరుజ్జీవానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించాలని సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని సూచించింది. పిటిషనర్ను మీరు ఎందుకు ఎన్జీటీకి వెళ్లకూడదు అని ప్రశ్నించింది. ప్రత్యేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నందున.. పిటిషన్ను విచారణకు తీసుకోవడం లేదని కోర్టు పేర్కొంది. నదులను ప్రక్షాళన చేసి, వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వామి గురుచరణ్ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.