Free Ration | న్యూఢిల్లీ: ఎంతకాలం ఈ ఉచితాలు అందచేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కొవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2013 నాటి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81 కోట్ల మంది ప్రజలకు ఉచిత లేదా సబ్సిడీ రేషన్ను అందచేస్తున్నట్లు కేంద్రం ఇచ్చిన సమాచారంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీన్ని బట్టి పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలినట్టున్నారు అంటూ కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటిలను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2020లో కొవిడ్ కాలంలో మొదలైన వలస కార్మికుల కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ శ్రమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలి? ఈ వలస కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, నైపుణ్యాభివృద్ధిని పెంపొందిచడానికి మనం ఎందుకు పని చేయకూడదు? అని ప్రశ్నించింది.