న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్లకు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందకుండా మినహాయించడానికి ప్రమాణాలను నిర్దేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తమ స్పందనను తెలియ చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. రిజర్వేషన్లపై 2024, ఆగస్టు 1న వెలువడిన తీర్పును అమలు చేయాలని కోరుతూ ఓపీ శుక్లా, సమతా ఆందోళన సమితులు దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్లు జోయ్మాల బాగ్చీ, ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.
దీనిపై కేంద్రం స్పందన కోరిన ధర్మాసనం కొన్ని రోజుల తర్వాత దీనిని విచారిస్తామని తెలిపింది. ప్రసిద్ధ మండల కమిషన్ తీర్పులో క్రిమీ లేయర్ సూత్రాన్ని నిర్దేశించారు. ఈ సూత్రం ప్రకారం ఓబీసీల్లోని సంపన్నులు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో కోటా ప్రయోజనాలను పొందకుండా నిషేధించారు. 2024లో నాటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు రాష్ర్టాలకు అధికారం ఉందని చారిత్రక తీర్పు చెప్పింది.