ముంబై: రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు మొదట తేల్చాలని మహారాష్ట్రకు చెందిన శివసేన వర్గం చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఆ తర్వాతే శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ఎవరికి చెందుతాయన్న దానిపై ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీ పేరుతోపాటు విల్లు-బాణం గుర్తును ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని ప్రశ్నించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూప్ వీటిని వినియోగించడం లేదన్న సంగతిని గుర్తు చేశారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు ప్రతి రోజూ విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, గత ఏడాది జూన్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. ప్రత్యేక విమానంలో అస్సాంలోని గువాహతికి చేరుకుని అక్కడ కొన్ని రోజులు మకాం వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాది (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోయింది. అనంతరం రెబెల్ నేత షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేపట్టారు.