న్యూఢిల్లీ, జూలై 2: న్యాయనిర్ణయ ప్రక్రియలో కృత్రిమే మేధ (ఏఐ) ప్రభావాన్ని పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ను ఆదేశించింది. పలు ట్రిబ్యునళ్లు ఏఐ సృష్టించిన కల్పితమైన తీర్పులపై ఆధారపడ్డాయని కనుగొన్న తరువాత సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధపై ఆధారపడి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ రెండు ట్రిబ్యునళ్లు ఓ దివాలా కేసుకు సంబంధించి నిర్ణయం తీసుకొనేటప్పుడు ఏఐ సృష్టించిన ‘కల్పితమైన’ తీర్పులపై ఆధారపడ్డాయని వ్యాఖ్యానించింది.
న్యాయనిర్ణయ ప్రక్రియ, న్యాయవాదుల వృత్తిలో ఏఐ వినియోగం ద్వారా ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం బార్ కౌన్సిల్కు సూచించింది. న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృత్రిమ మేధ సహకారిగా ఉన్నప్పటికీ అది మానవ తార్కిక శక్తికి ప్రత్యామ్నాయం కాబోదని బెంచ్ వ్యాఖ్యానించింది. న్యాయ నిర్ణయ ప్రక్రియ ప్రతి దశలో, పూర్తిగా, మానవ నియంత్రణలోనే ఉండాలని నొక్కిచెప్పింది. ఈ కేసులో ట్రిబ్యునల్.. కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన, ఉనికిలో లేని, బోగస్, కల్పిత అంశాలపై ఆధారపడి నిర్ణయం తీసుకున్నదని తెలిపింది.
అందువల్లనే న్యాయప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తున్నామని స్పష్టంచేసింది. కేవలం ఓ తప్పుడు తీర్పును సరిదిద్దడానికే పరిమితం కాకుండా ఏఐ పట్ల న్యాయవ్యవస్థ వైఖరిని నిర్వచించడానికి ఈ కేసు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అంతకుముందు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది మాధవీ దివాన్ తన వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ట్రిబ్యునళ్లు ఆరు తీర్పులపై ఆధారపడ్డాయని, కానీ నిజానికి అవి ఎక్కడా ఉనికిలో లేకపోగా.. న్యాయపరమైన అంశాలకు అవి ఏమాత్రం ఉపయోగపడనివి అని తెలిపారు. ఆ ఆరు తీర్పులను తాము గుర్తింపు పొందిన ఏ డాటాబేస్లోనూ కనుగొనలేకపోయామని వెల్లడించారు. దీంతో అవి కల్పితమైనవి లేదా ఏఐ ద్వారా సృష్టించబడిన కల్పిత ఉల్లేఖనలు అని తెలుస్తున్నదని వివరించారు.