న్యూఢిల్లీ: ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ఏ కింద 1,000 కి పైగా కేసులు నమోదయ్యాయని చెప్పడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆన్లైన్లో ‘అభ్యంతరకరమైన’ కంటెంట్ను పోస్ట్ చేసినందుకు వ్యక్తులను అరెస్ట్ చేయడానికి ఈ వివాదాస్పద చట్టం అనుమతించింది. మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ చట్టాన్ని ఏడు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ ఈ సెక్షన్ కింద కేసులు నమోదు కావడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రద్దు చేసిన చట్టాన్ని ఉపయోగించడంపై దాఖలైన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. సోమవారం కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపుగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం కోరింది.
ఒక మైలురాయి వంటి తీర్పులో ఐటీ సెక్షన్ 66 ఏ ను 2015 మార్చి 24 న అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ పనికిరాని చట్టాన్ని ‘రాజ్యాంగ విరుద్ధం’, ‘స్వేచ్ఛాయుత ఉల్లంఘన’ గా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సెక్షన్ 66 ఏ కింద సుప్రీంకోర్టు 2015 తీర్పు నాటి నుంచి కేసులు 229 నుంచి 1,307 కి పెరిగాయని పిటిషన్దారు అయిన పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అన్ని పోలీస్ స్టేషన్లకు సలహా ఇచ్చేలా కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని పీయూసీఎల్ తమ పిటిషన్లో సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర (381) లో నమోదయ్యాయి. తర్వాతి వరుసలో జార్ఖండ్ (291), ఉత్తర ప్రదేశ్ (245), రాజస్థాన్ (192) ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (38), అసోం (59), ఢిల్లీ, (28), కర్ణాటక (14), తెలంగాణ (15), తమిళనాడు (7), పశ్చిమ బెంగాల్ (37) ఉన్నాయి.
ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ‘ఇంకా ఈ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయా?’ అంటూ ఒకింత ఆశ్చర్యంతోపాటు అసహనాన్ని ప్రదర్శించింది. ‘అద్భుతం.. జరుగుతున్నది భయంకరంగా ఉన్నది’ అని ధర్యాసనం వ్యాఖ్యానించింది. అనంతరం ఈ రద్దు చేసిన చట్టం కింద కేసులు నమోదు చేయడంపై రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు పంపుతున్నట్లు జస్టిస్ ఆర్ నారిమణ్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొన్నది.
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..