Supreme Court : పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ లోక్సభ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి అనర్హత పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా తిరుగుబాటు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో అభిషేక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలో చేరిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై గతంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే, ఎంపీల అనర్హత విషయంలో స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో అభిషేక్ ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు 20 మంది రెబల్ ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. కానీ, లోక్సభ స్పీకర్కు మాత్రం నోటీసులు ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో స్పందించారు. ప్రస్తుతానికి స్పీకర్కు నోటీసులు ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై స్పీకర్ను సంప్రదించి, ఆ వివరాల్ని కోర్టుకు సమర్పిస్తానని చెప్పారు. దీంతో కోర్టు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. అయితే, స్పీకర్ స్పందన అనంతరం మళ్లీ నోటీసుల అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.
ఎంపీల అనర్హత విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా తాము రాజ్యాంగ వ్యవస్థలకు సూచించలేమని, కానీ, ఈ విషయంలో ఒక కాల పరిమితి ఉండటం సముచితంగా ఉంటుందని జడ్జి జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు.