CJI Justice DY Chandrachud | సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసిన ఓ పిటిషన్పై ఓ న్యాయవాది ముందస్తు విచారణ కోసం పట్టుబట్టగా.. ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన అధికారాలను సవాల్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. సుప్రీంకోర్టు నిత్యం వివిధ బెంచ్ల ద్వారా సగటున వంద అత్యవసర కేసులను విచారణ కోసం జాబితా చేస్తున్నది.
ఈ క్రమంలో మంగళవారం సీజేఐ బెంచ్ ముందుకు ఓ న్యాయవాది కేసు వచ్చింది. ఈ కేసును ఈ నెల 17న విచారణ జరిపేందుకు సీజేఐ జాబితా చేశారు. అయితే, సదరు న్యాయవాది అంతకన్నా ముందే విచారణ జరిపించాలని, మరో బెంచ్ ముందుకు పిటిషన్ను తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీజేఐని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. అయినా, పట్టుబట్టడంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కేసు విచారణ 17న లిస్ట్ అయ్యింది. ఇప్పుడు 14న విచారణ కోసం ఇంకో బెంచ్ ముందుకు వెళ్తామంటున్నారు.
నా అధికారాలతో ఆడుకోవద్దు. ఈ ట్రిక్స్ నా వద్ద ప్లే చేయొద్దు. మీ కేసు విచారణ 17నే చేపడతాం’ అంటూ గట్టిగానే మందలించారు. దాంతో న్యాయవాది సీజేఐకి క్షమాపణలు చెప్పడంతో.. ‘మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాం. నా అధికారాలను సవాల్ చేసేందుకు ప్రయత్నించకండి’ అంటూ సూచించారు. గత నెలలోనూ ఓ న్యాయవాది తీరుపై సైతం సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పిటిషన్పై విచారణ విషయంలో సదరు న్యాయవాది పట్టుబట్టడంతో ‘నన్ను బెదిరించాలని చూడకండి. మీ బెదిరింపులకు లొంగను’ అంటూ మందలించారు.