Adani Group | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన సీల్డ్కవర్ సిఫారసులను తిరస్కరించింది. హిండెన్బర్గ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై లోతుగా దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని ఈ నెల 10న తొలిసారి విచారించిన కోర్టు, శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. 10న సుప్రీం ఇచ్చిన ఆదేశాల మేరకు అదానీ వ్యవహారంపై విచారణకు నిపుణుల పేర్లను సూచిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్కవర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి సమర్పించారు. అయితే, ఆ కవర్లోని పేర్లను ధర్మాసనం తిరస్కరించింది. తామే స్వయంగా నిపుణుల కమిటీని నియమించి, విచారణను పర్యవేక్షిస్తామని తెలిపింది. కమిటీలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తిని కూడా నియమించాలన్న పిటిషన్దారుల విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది.
మదుపరుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. స్టాక్మార్కెట్లో పారదర్శకత అత్యంత ముఖ్యమని ఉద్ఘాటించింది. ‘ఇప్పుడు మీరు అందించిన సీల్డ్కవర్లో సూచించిన వ్యక్తులతో విచారణ కమిటీ వేస్తే, అది కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీయే అవుతుంది కదా? ఆ సీల్డ్ కవర్ను ఆమోదిస్తే అవతలిపక్షం వారికి ఆ కమిటీ గురించి ఎలా తెలుస్తుంది? మదుపరుల రక్షణకు మార్కెట్లో స్పష్టమైన పారదర్శకత ఉండాలని మేం భావిస్తున్నాం. అందుకోసం మేమే ఓ కమిటీ వేస్తాం. ఆ కమిటీ విచారణను సుప్రీం సిట్టింగ్ న్యాయమూర్తులే పర్యవేక్షిస్తారు. కానీ, ఆ కమిటీలో మాత్రం భాగస్వాములు కాలేరు’ అని సీజేఐ స్పష్టంచేశారు. దీంతో కమిటీని త్వరగా నియమించాలని ధర్మాసనాన్ని సొలిసిటర్ జనరల్ కోరారు.
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థలపై విచారణ జరిపే వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లను సీల్డ్కవర్లో అందించేందుకు కేంద్రం ప్రయత్నించగా, సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. అదానీ వ్యవహారంపై విచారణకు తామే నిపుణుల కమిటీ వేస్తామని స్పష్టంచేసింది. మదుపరుల రక్షణకు మార్కెట్లో స్పష్టమైన పారదర్శకత ఉండాలని భావిస్తున్నామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొన్నది.