Electoral Bonds | న్యూఢిల్లీ, మార్చి 18: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల వివరాల వెల్లడిలో ‘సెలక్టివ్’ విధానాన్ని మానుకోవాలని, ఈ నెల 21లోగా ఏ దాత, ఏ రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో ఎంత విరాళం ఇచ్చారనేది తెలియజేసే యునిక్ బాండ్ నంబర్లతో సహా ఈసీకి పూర్తి వివరాలు సమర్పించాల్సిందేనని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఎస్బీఐని ఆదేశించింది. ఆ తర్వాత యునిక్ నంబర్లతో సహా అన్ని వివరాలు ఇచ్చేశామని చెబుతూ ఎస్బీఐ సీఎండీ 21న సాయంత్రం 5 గంటలలోగా సుప్రీంకోర్టుకు ఆఫిడవిట్ సమర్పించాలని పేర్కొన్నది. ఇదే సమయంలో ఎస్బీఐ నుంచి బాండ్ల పూర్తి వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఈసీకి సూచించింది.
బాండ్ల వివరాల వెల్లడిని వ్యతిరేకిస్తూ అ సోచామ్, సీఐఐ దాఖలు చేసిన అన్లిస్టెడ్ మ ధ్యంతర పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ధర్మాసనం తిరస్కరించింది. బాండ్ల వివరాల వెల్లడిపై ఇచ్చిన తీర్పును సమీక్షించే అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరు తూ సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు అదిశ్ సీ అగర్వాలా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అగర్వాలాకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చీవాట్లు పెట్టారు. ‘మీరు ఒక సీనియర్ న్యాయవాది, ఎస్సీబీఏ అధ్యక్షుడిగానూ ఉన్నారు. మీకు న్యాయ ప్రక్రియ తెలుసు. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు. ఇలాంటి వాటిని మేం అనుమతించబోం’ అని పేర్కొన్నారు.
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని, వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఐదేండ్లలో జారీచేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. అయితే ఈసీకి అందించిన ఎస్బీఐ బాండ్ల సమాచారం అసంపూర్తిగా ఉన్నదని, ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ రాజకీయ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు వెల్లడించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎస్బీఐకి తాజా ఆదేశాలు ఇచ్చింది.