పాట్నా: తల్లి పాలపై ఒక అధ్యయనం జరిగింది. అందులో యురేనియం ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. తల్లి పాలు తాగే బిడ్డలపై దీని ప్రభావం పడుతుందని ఆ స్టడీ రిపోర్ట్ హెచ్చరించింది. (Uranium In Breast milk) అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే చాలా తక్కువగా యురేనియం స్థాయిలు ఉండటంతో ఎలాంటి భయం అవసరంలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ పరిశోధనా కేంద్రం, ఢిల్లీకి చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం బీహార్లో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. బిడ్డలకు పాలిచ్చే 40 మంది తల్లుల నుంచి తల్లి పాలు నమూనాలు సేకరించారు. వాటిలో యూరేనియం ఆనవాళ్లను పరిశీలించారు.
కాగా, బీహార్లో సేకరించిన 40 మంది తల్లుల పాల నమూనాల్లో యూరేనియం-238 ఆనవాళ్లు కనిపించాయి. 5 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో తల్లులతోపాటు తల్లిపాలు తాగే శిశువులకు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదం 70 శాతం వరకు పొంచి ఉన్నట్లు అంచనా వేశారు.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతించిన పరిమితుల కంటే బీహార్లోని తల్లుల పాలలో యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు పెరుగుతుండటం దీనికి కారణమని తెలిపారు. దీని వల్ల దీర్ఘ కాలంలో తల్లులతోపాటు శిశువులపై చాలా హానికరమైన ఆరోగ్య ప్రభావాలు చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.
బీహార్ అధ్యయన ఫలితాలు శిశువుల ఆరోగ్యంపై వాస్తవ ప్రభావం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనానికి సహ రచయితగా ఉన్న ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. మహిళలు తప్పనిసరిగా పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని చెప్పారు.
మరోవైపు ఎలాంటి ఆందోళన అవసరం లేదని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యుడు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్, సీనియర్ అణు శాస్త్రవేత్త డాక్టర్ దినేష్ కే అస్వాల్ తెలిపారు. బీహార్లోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధనా కేంద్రానికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వంలోని అధ్యయనం ఫలితాలు ప్రజారోగ్యానికి ఎలాంటి ఆందోళన కలిగించవని వివరించారు.
బీహార్ తల్లుల పాలల్లో గుర్తించిన యురేనియం స్థాయిలు సురక్షితమైన పరిమితుల్లోనే ఉన్నాయని డాక్టర్ దినేష్ తెలిపారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే తాగునీటిలోనే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా యూరేనియం స్థాయిలు ఉన్నాయని అన్నారు.
Also Read:
Chandigarh Bill Row | చండీగఢ్ బిల్లుపై వివాదం.. తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
Girl Dies By Suicide | పేరెంట్స్ మొబైల్ ఫోన్ కొనివ్వలేదని.. బాలిక ఆత్మహత్య
Watch: మినీ లారీని ఢీకొట్టిన వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?