చండీఘడ్ : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్ను సస్పెండ్ చేయాలని హరియాణ రాష్ట్రానికి చెందిన సిర్సాలో దేవీ లాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్ధినులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మనోహర్లాల్ ఖట్టర్కు లేఖ రాశారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జిచే విచారణ చేపట్టాలని విద్యార్ధినులు కోరుతున్నారు. లేఖ ప్రతులను వీసీ డాక్టర్ అజ్మీర్ సింగ్ మాలిక్, హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా సంస్ధలకు పంపారు.
విద్యార్ధినుల పట్ల ప్రొఫెసర్ అనుచితంగా వ్యవహరిస్తూ అభ్యంతరకర చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. లేఖలో ప్రస్తావించిన వివరాల ప్రకారం ప్రొఫెసర్ బాలికలను తన కార్యాలయంలోకి పిలిపించి బాత్రూంలోకి తీసుకెళ్లి ప్రైవేట్ భాగాలను తడుముతూ, అసభ్యంగా వ్యవహరించేవాడని విద్యార్ధినులు వివరించారు. ప్రొఫెసర్ చేష్టలను తాము ప్రతిఘటిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించేవాడని లేఖలో పేర్కొన్నారు. చాలా నెలలుగా ఈ దురాగతం జరుగుతోందని ప్రొఫెసర్ పెద్దమనిషిగా చెలామణి అవుతుండటంతో ఆయనను ఎవరూ ప్రశ్నించడం లేదని విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు.
వీసీ తమను కాపాడేందుకు ముందుకు రాకపోగా ప్రొఫెసర్కు రాజకీయ పలుకుబడి ఉండటంతో తమనే కాలేజ్ నుంచి బహిష్కరిస్తామని బెదిరించేవాడని ఆరోపించారు. పరీక్షల్లో మెరుగైన మార్కులు వేస్తామని, ఈ విషయం బయటపెట్టవద్దని తమకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడని విద్యార్ధినులు పేర్కొన్నారు. కాగా ప్రొఫెసర్పై విద్యార్ధినుల లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ వాస్తవమేనని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సల్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని, వర్సిటీ కూడా అంతర్గత విచారణ నిర్వహిస్తోందని, దీనిపై నివేదిక అనంతరం చర్యలు చేపడతామని బన్సల్ తెలిపారు.
Read More :
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్కు బానిసే.. అతనెవరంటే?