(స్పెషల్ టాస్క్ బ్యూరో):
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కారు 2015లో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ (పీఎంఏవై)’ను ప్రారంభించింది. అయితే, ఈ స్కీమ్ ముసుగులో అధికార యంత్రాంగం, ఆ పార్టీ నేతలు రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నట్టు మరోసారి తేటతెల్లమైంది. గత నెల 22న ధనత్రయోదశిన మధ్యప్రదేశ్లో 4.51 లక్షల ఇండ్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అయితే, పీఎంఏవై స్కీమ్ కింద ప్రభుత్వం కట్టించినట్టు చెప్తున్న వాటిలో వందల ఇండ్లు వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో నిర్మించనే లేదు. చనిపోయిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. లబ్ధిదారులుగా పేర్కొన్న వందల మంది పేదలకు అసలు ఇండ్లనే అప్పగించలేదు. మధ్యప్రదేశ్లో సత్నా జిల్లాలోని రహిక్వారా గ్రామంలో ఇంగ్లిష్ వార్తా చానల్ ‘ఎన్డీటీవీ’ చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సంగతి వెల్లడైంది.
పూజలో ఉన్నానంటూ తప్పించుకొన్న మంత్రి
2015 నుంచి గ్రామంలో 600 ఇండ్లు కట్టినట్టు ప్రభుత్వం చెప్తున్నదని, అయితే, ఆ ఇండ్లలో కొన్ని చనిపోయిన వారి పేరిట మంజూరవ్వగా, మరికొన్ని అసలైన లబ్ధిదారులకు అందనే లేదని రహిక్వారా గ్రామస్థులు వాపోయారు. ప్రధాని గత నెలలో ప్రారంభించిన మొత్తం ఇండ్లలో గ్రామానికి సంబంధించి 75 ఇండ్లు అసలు నిర్మించనేలేదని మండిపడ్డారు. ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల వివరాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఎన్డీటీవీ బృందం ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి మహేంద్ర సిసోడియాను సంప్రదించడానికి ప్రయత్నించగా తాను పూజలో ఉన్నానని మంత్రి బదులివ్వడం గమనార్హం. మీటింగ్లో ఉన్నానంటూ తొలుత దాటవేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ వర్మ అనంతరం ఎట్టకేలకు స్పందిస్తూ.. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు. కాగా, రహిక్వారా గ్రామంలో 1,200 మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు ఖర్చుచేసినట్టు ప్రభుత్వం చెప్తుండగా.. వాటి నిర్మాణమే జరుగలేదు. దీంతో గ్రామస్థులు బహిరంగ మలవిసర్జనే చేస్తున్నారు.
పీఎం ఆవాస్ యోజన పథకం స్వరూపం
స్కీమ్ ప్రారంభం: 2015 జూన్ 25
2022 మార్చి 31 నాటికి కేంద్రం నిర్మిస్తానన్న ఇండ్ల లక్ష్యం: 5 కోట్లు (పట్టణాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 3 కోట్లు)
ఇప్పటివరకూ కేంద్రం నిర్మించిన ఇండ్లు (ప్రభుత్వం చెప్తున్నట్టు): 2.39 కోట్లు (పట్టణాల్లో 64 లక్షలు, గ్రామాల్లో 1.75 కోట్లు)
సేకరణ: పీఎంఏవై వెబ్సైట్, లోక్సభలో కేంద్రం ప్రకటనల ఆధారంగా
మా తండ్రి లాల్మాన్ చౌదరీ 2016లో మరణించారు. ఆయనకు ఇల్లు మంజూరు చేసినట్టు తాజా జాబితాను చూస్తే తెలిసింది. 2021-22 మధ్య ఆయన బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేసినట్టు అందులో ఉన్నది. కానీ మాకు ఎలాంటి డబ్బూ అందలేదు. ఇల్లు కూడా రాలేదు.
-లాల్మాన్ కుమారుడు శివకుమార్ చౌదరీ, రహిక్వారా