Delhi High Court: వీధి కుక్కలు పాదచారుల పాలిట శాపాలుగా మారాయని ఢిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) నిర్లక్ష్యం వల్ల తన ఏడాదిన్నర బిడ్డను నాలుగైదు కుక్కల గుంపు దారుణంగా కరిచి చంపిందని, అందుకుగాను తనకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని మృతురాలి తండ్రి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సందర్భంగా న్యాయస్థానం పైవ్యాఖ్య చేసింది.
పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) కు, నగర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జనంపై వీధి కుక్కల దాడులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదికను సమర్పించాలని ఆ నోటీసులలో కోర్టు ఆదేశించింది. గత నెల 24న తుగ్లక్ లేన్లోని ధోబీ ఘాట్ ఏరియాలో ఏడాదిన్నర చిన్నారి తన ఇంటిముందు కూర్చుని ఉండగా వీధికుక్కలు దాడిచేశాయి. కొంతదూరం ఈడ్చుకెళ్లి కరిచిచంపేశాయి.
రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే నగరంలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై దాడులు చేస్తున్నాయని, అదే క్రమంలో నా బిడ్డ బలైందని, అందుకుగాను తనకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మృతురాలి తండ్రి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.