న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఎన్నికల ముందర ప్రతిపక్ష నేతల లక్ష్యంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులను ముమ్మరం చేయడంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రతిపక్ష పార్టీలు, నేతలపై కేంద్ర ఏజెన్సీలు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరింది. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రెయిన్ సహా పలువురు నేతలు ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని వారు ఆరోపించారు. కేంద్ర సంస్థల డైరెక్టర్లను బదిలీ చేయాలని కోరారు. రాజ్యాంగ రక్షణలో భాగంగా ఈసీ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.