Stock Markets : నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) ఫలితాలు స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో జోష్ నింపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ (Exitpolls) అంచనాలకు తగ్గట్టుగానే ప్రారంభ ట్రెండ్స్లో అధికార మార్పు సూచనలు కనిపిస్తుండటం, అన్నిచోట్లా స్పష్టమైన మెజారిటీలు కనబడుతుండటం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. నేడు మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం నుంచే బుల్ రన్ (Bull run) కొనసాగుతోంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ ఏకంగా 745 పాయింట్లు ఎగబాకి 77,656 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 220 పాయింట్లకుపైగా లాభంతో 24,215 పాయింట్లకు పైస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా అనిశ్చితిలో ఉన్న మార్కెట్లు.. నేడు ఫలితాల సరళి స్పష్టంగా ఉండటంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగ షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్ను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుండటంతో మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల అనుకూల విధానాలు వస్తాయనే ఆశతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
ముఖ్యంగా రైల్వే, డిఫెన్స్, పవర్ గ్రిడ్ వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం పెరుగుతుందనే అంచనాలు మార్కెట్కు బూస్ట్ను ఇచ్చాయి. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీయే పట్టు నిలుపుకోవడం కూడా స్థిరత్వానికి చిహ్నంగా మార్కెట్ భావిస్తోంది. మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్తో ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు 2 నుంచి 3 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చేలోపు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని, కేవలం రాజకీయ ఫలితాలనే కాకుండా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువను కూడా గమనించాలని హెచ్చరిస్తున్నారు.