ముంబై: స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గడిచిన ఆరు రోజుల ట్రేడింగ్స్లో వరుసగా నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 63,782 కి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో 19,047 వద్ద స్థిరపడింది. యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మరింత పతనమై రూ.83.234 కు చేరింది.
సెన్సెక్స్ 30 లోని యాక్సిక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, విప్రో, భారతీ ఎయిర్టెల్ భారీగా లాభపడ్డాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీలు స్పల్ప నష్టాలతో ట్రేడయ్యాయి. దేశీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత రూపాయి శుక్రవారం స్వల్పంగా రెండు పైసలు బలహీనపడింది. డాలర్ బలపడడం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడుల తరలింపు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా రూపాయిపై ఒత్తిడిని కలిగించాయి. సిరియాలో యూఎస్ మిలిటరీ, ఇరాన్ల మధ్య అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రానున్నరోజుల్లో రూపాయి విలువ మరింత బలహీనం కానుందనే అంచనాలు వెలువడుతున్నాయి.