న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య దోస్తానా శ్రీలంకలో చిచ్చు పెట్టింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్లోని విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ అదానీ గ్రూప్ చేతిలోకి వెళ్లిపోతుండగా, ఇప్పుడు పొరుగు దేశంలో కూడా అదానీ కోసం మోదీ వకాల్తా పుచ్చుకొన్నట్టు బయటపడింది. శ్రీలంకలోని మన్నార్లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ (గాలి ఆధారిత) పవర్ ప్లాంటు కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినట్టు తేలింది. శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండోయే స్వయంగా ప్రకటించటం సంచలనం సృష్టిస్తున్నది. ఫెర్డినాండో వ్యాఖ్యలను గొటబయ ఖండించినప్పటికీ ఆ దేశంలో అదానీ గ్రూప్తో ఒప్పందానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది.
అసలేం జరిగిందంటే..
శ్రీలంకలో సంప్రదాయేతర ఇంధన వనరుల మౌలిక వసతుల ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాలపై ఆ దేశ పార్లమెంటులోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ విచారణ జరుపుతున్నది. ఈ కమిటీ ముందు ఫెర్డినాండో శుక్రవారం హాజరై కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మన్నార్ ప్లాంటు గురించి అడగకూడనిది ఏమైనా ఉన్నదా? అని కమిటీ చైర్మన్ చరిత హెరాత్ ప్రశ్నించగా.. ‘అవును.. ఇది రెండు ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరిన డీల్. 2021 నవంబర్ 24న గొటబయ రాజపక్స నన్ను పిలిపించారు. మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు ఇవ్వాలని భారత ప్రధాని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు’ అని కుండబద్ధలు కొట్టారు.
ఖండించిన గొటబయ
ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలం వీడియోను శ్రీలంక టీవీ చానల్ న్యూస్ ఫస్ట్ ప్రసారం చేయటంతో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. శనివారం రాత్రి అధ్యక్షుడు గొటబయ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన మాటలను ఫెర్డినాండో ఉపసంహరించుకొన్నారు. మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఏ వ్యక్తికిగానీ, ఏ సంస్థకుగానీ ఇవ్వాలని నేను సిఫారసు చేయలేదు’ అని ప్రకటించారు.
అదానీకి మేలుచేసేలా చట్ట సవరణ
అదానీ గ్రూప్నకు విండ్ పవర్ ప్లాంటు పోటీ లేకుండా ఇవ్వాలని సిఫారసు చేయలేదని ఒకవైపు చెప్తూనే, మరోవైపు గొటబయ ప్రభుత్వం అదానీకి మేలు చేసేలా చట్ట సవరణ చేయటం ఇప్పుడు మరింత అగ్గి రాజేసింది. విండ్, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎలాంటి పోటీ లేకుండా ఎంపికచేసిన సంస్థలకు అప్పగించేలా 1989 నాటి ఎలక్ట్రిసిటీ చట్టానికి ప్రతిపాదించిన సవరణకు లంక పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. దీంతో అదానీ గ్రూప్నకు మన్నార్ ప్లాంటు అప్పగింత ఒప్పందం చట్టబద్ధంగా మారిపోయింది. ఈ చట్ట సవరణపై ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవెగయ (ఎస్జేబీ) తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్తో ఒప్పందాన్ని ప్రశ్నించకూడదనే ఈ చట్ట సవరణ చేశారని మండిపడింది.
పోటీ లేకపోవటంతో రెట్టింపైన యూనిట్ ధర
మన్నార్లో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటును నిర్మించి నిర్వహించి అప్పగించేలా 25 ఏండ్ల కాలానికి సీఈబీతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకొన్నది. ఎంవోయూ సమయంలో యూనిట్ విద్యుత్తును 6.50 అమెరికన్ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా ఒప్పందం కుదిరింది. కొంతకాలానికి ఈ ధరను అదానీ గ్రూప్ 7.55 సెంట్లకు పెంచేసింది. దీనిపై శ్రీలంక విద్యుత్తు ఇంజినీర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ప్లాంటును అంతర్జాతీయ పోటీ బిడ్ల ద్వారా అప్పగిస్తే 4 సెంట్లకే యూనిట్ విద్యుత్తు వచ్చేదని, ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తున్నదని చెప్తున్నారు. పోటీ లేకపోవటంతో అదానీ గ్రూప్కు 25 ఏండ్లలో నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని అంచనా వేశారు.
అదానీ నుంచి సింగరేణిని రక్షించిన కేసీఆర్
తెలంగాణలో వేలమంది ఉద్యోగులకు ఉపాధినిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీని కూడా హస్తగతం చేసుకొనేందుకు అదానీ గ్రూప్ ఒకప్పుడు చేసిన ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ అడ్డుకొన్నారు. అస్ట్రేలియాలోని తమ బొగ్గు గనుల నుంచి భారతదేశం మొత్తానికి బొగ్గును సరఫరా చేస్తామని, సింగరేణిని కూడా తమకు ఇవ్వాలని గౌతమ్ అదానీ, సీఎం కేసీఆర్ను కోరారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ మరి సంస్థ ఉద్యోగుల సంగతేంటని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు. 2017 అక్టోబర్ 7న ప్రభుత్వరంగ సంస్థలపై అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆరే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.
అదానీ కోసం మోదీ వకాల్తా
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు భారీ ప్రాజెక్టులు అదానీ గ్రూప్ చేతిలోకి వెళ్తుండగా.. తాజాగా విదేశాల్లోనూ అదానీకి లబ్ధి చేకూర్చేలా మోదీ వ్యవహరిస్తున్నట్టు వెల్లడైంది. శ్రీలంకలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ కంపెనీకి ఇవ్వాలంటూ ఆ దేశ అధ్యక్షుడు గొటబయపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినట్టు తేలింది. సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ పెర్డినాండో స్వయంగా ఈ విషయం వెల్లడించడం దుమారం రేపుతున్నది.