Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసు (defamation case)లో బెంగళూరు స్పెషల్ కోర్టు (Bengaluru Special Court) బెయిల్ మంజూరు చేసింది. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019-2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ప్రతీ పనిలోనూ 40% కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరఫున పరువు నష్టం దావా వేశారు. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని పేర్కొన్నారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీని కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు న్యాయమూర్తి ఎదుట రాహుల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు స్పెషల్ కోర్టు రాహుల్కు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసింది.
Also Read..
RBI: రెపో రేటు యధాతథం.. మానిటరీ పాలసీ రిపోర్టు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్
Gold Seized | బెంగళూరు ఎయిర్పోర్ట్లో 9 కిలోల బంగారం పట్టివేత