న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వాయిదా వేయకూడదని కూడా సుప్రీంకోర్టు ప్రత్యేక కోర్టులను స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీబాలా, మనోజ్మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం దేశంలోని అన్ని హైకోర్టులు, జిల్లా జడ్జీలు, ప్రజాప్రతినిధుల కేసులను విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టులకు మార్గదర్శకాలు జారీచేసింది.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి ‘ఇన్ రీ డెసిగ్నేటెడ్ కోర్ట్స్ ఫర్ ఎంపీస్/ఎమ్మెల్యేస్’ పేరుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా ఒక కేసు నమోదు చేయాలని సూచించింది. అనేకమైన స్థానిక అంశాల కారణంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులకు తాము ప్రామాణికమైన మార్గదర్శకాలను రూపొందించలేకపోతున్నామని తెలిపింది. అందువల్ల ఈ అంశాన్ని ట్రయల్ కోర్టులపై పర్యవేక్షక అధికారం ఉన్న హైకోర్టులపై పెడుతున్నామని పేర్కొంది. ట్రయల్ కోర్టులు, జిల్లా/సెషన్స్ కోర్టులపై ఒత్తిడి తెచ్చి ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణను హైకోర్టులు వేగవంతం చేయాలని ఆదేశించింది.
నిర్దేశిత కోర్టు ముందుగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన మరణశిక్ష లేదా యావజ్జీవ జైలు శిక్ష విధించదగిన కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ తరువాత ఐదేండ్ల కన్నా ఎక్కువ కాలం జైలుశిక్ష పడే కేసులను చేపట్టాలని పేర్కొంది. గత ఏడాది నవంబర్ 14 నాటికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై 5,175 క్రిమినల్ కేసులు ఉన్నట్టు కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిలో 2,116 కేసులు ఐదేండ్లకుపైగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.