న్యూఢిల్లీ: భారతీయ వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాల(Southwest Monsoon) మే 26వ తేదీ వరకు కేరళలో ప్రవేశించనున్నట్లు ఐడీఎం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ వరకు నైరుతీ రుతుపవనాలు కేరళ చేరుకుంటాయి. ఆ రుతుపవనాలు కేరళ చేరుకోవడంతో భారత్లో వర్షాకాలం మొదలువుతుంది. ఆ తర్వాత ఆ రుతుపవనాలు ఉత్తర భారత దేశం దిశగా పయనిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఇండియాలో వర్షాకాలం ఉంటుంది. అయితే గత ఏడాది మే 24వ తేదీన కేరళకు నైరుతీ రుతుపవనాలు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఒక నాలుగు రోజులు ముందే లేదా తర్వాత నైరుతీ ఆగమనం ఉంటుందని భావిస్తున్నారు.
నైరుతీ రుతుపవనాల రాక కోసం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం మొత్తం పశ్చిమ భారతం, మధ్య భారతంలో తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ చెప్పింది.ఇక రాబోయే మూడు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.