న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూల ప్రతిష్టను దెబ్బతీయడమే పనిగా పెట్టుకుందని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారత దళాల త్యాగాలను సైతం చిన్నగా చూపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
చారిత్రక వాస్తవాలను మరుగునపరచడం, గాంధీ, నెహ్రూ, ఆజాద్, పటేల్ వంటి మహానీయుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కేంద్ర పాలకుల చర్యలను కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. గత 75 ఏండ్లుగా శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య, సమాచార సేవల రంగాల్లో భారత నిపుణులు దేశాన్ని అగ్రపధాన నిలిపారని కొనియాడారు.
నిజాయితీ, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల వ్యవస్ధను మన దార్శనిక నేతలు నెలకొల్పారని అన్నారు. పటిష్ట ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్ధల నిర్మాణానికి గట్టి పునాదులు వేశారని సోనియా గాంధీ చెప్పారు. భిన్న సంస్కృతులు, భాషలతో భారత్ అద్భుత దేశంగా ప్రపంచం ముందు ఆవిష్కృతమైందని అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.