ముంబై : (Ramdas Athawale) ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే.. మరోసారి తన మాటలతో వివాదం రేగేలా చేశారు. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతోపాటు మన్మోహన్ను కూడా టార్గెట్ చేశారు. ఇదే సమయంలో తాను ఎన్డీఏలోనే ఉండి మంత్రి పదవిని వెలగబెడుతున్న విషయాన్ని కూడా మర్చిపోయి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. తనకు అధికార పీఠం ఎక్కడానికి ఇష్టం లేకపోతే.. మన్మోహన్ సింగ్కు బదులుగా శరద్ పవార్ను ప్రధానిగా చేసి ఉంటే బాగుండేదన్నారు. అలా చేయడం వల్ల కాంగ్రెస్ మెరుగైన శక్తిగా తయారయ్యేదని కూడా చెప్పడం విశేషం.
2004 పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఉన్నప్పటికీ తానే ప్రధాని పీఠంపై కూర్చొనకపోవడంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే విభిన్నంగా స్పందించారు. తనకు ఇష్టం లేకపోతే ఆ పీఠంపై మన్మోహన్కు బదులుగా శరద్ పవార్ను ఎంచుకుంటే బాగుండేదన్నారు. ‘యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాల్సి ఉండేది. కమలా హారిస్ అమెరికా వైస్ప్రెసిడెంట్ అయినప్పుడు.. సోనియా గాంధీ భారతదేశానికి ప్రధాని ఎందుకు కాలేరు? ఆమె భారత పౌరురాలు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ భార్య, లోక్సభ సభ్యురాలుగా కూడా ఉన్నారు’ అని అథవాలే అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో మన్మోహన్ సింగ్కు బదులుగా శరద్ పవార్ను ప్రధానమంత్రిగా చేసి ఉంటే భవిష్యత్లో కాంగ్రెస్ బలమైన శక్తిగా తయారయ్యేదని, ఇప్పుడు ఎదుర్కొంటున్న గందరగోళం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న రాందాస్ అథవాలే.. సోనియా గాంధీ విదేశీ మూలం గురించి మాట్లాడటం అర్ధంలేనిదని, 2004 ఎన్నికల్లో యూపీఏకు మెజారిటీ వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని తానే ప్రతిపాదించానని చెప్పారు. ఆమె విదేశీ మూల సమస్యకు అర్థం లేదని అభిప్రాయపడ్డానని అథవాలే ఇండోర్లో ఇటీవల మీడియాతో అన్నారు.
2014 లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. సోనియా గాంధీ నాయకత్వంపై, ఆమె విదేశీ మూలాలపై తిరుగుబాటు చేయడంతో శరద్ పవార్ను పార్టీ నుంచి బహిష్కరించారు. 1999 లో కాంగ్రెస్ నుంచి విడిపోయిని పవార్.. అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ని స్థాపించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్తో కలిసి మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకున్నారు. మిస్టర్ అథవాలే కూడా మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు కావడం విశేషం.
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
వార్ మ్యూజియంను సందర్శించిన వెంకయ్యనాయుడు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..