(Babu George Valavi) కొచ్చి : కేరళకు చెందిన ఓ పెద్దాయన.. 43 సంవత్సరాల క్రితం 3,500 షేర్లను కొని మర్చిపోయాడు. ఇప్పుడు వాటి విలువ రూ.1,448 కోట్లకు చేరుకున్నది. అయితే, డబ్బులు ఇచ్చేందుకు సదరు కంపెనీ ఒప్పుకోవడం లేదు. దాంతో ఆ కంపెనీపై యుద్ధం చేసేందుకు సిద్ధమై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) లో ఫిర్యాదు చేశాడు. కంపెనీ వాటాలకు అసలు యజమాని తానే అని, అయితే, ఎప్పుడో అమ్మేశారని కంపెనీ బుకాయిస్తున్నదని సదరు పెద్ద మనిషి వాపోతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తానని ధీమాగా చెప్తున్నాడాయన.
కేరళలోని కొచ్చికి చెందిన బాబు జార్జ్ వాలవి.. 1978 లో మేవార్ ఆయిల్, జనరల్ మిల్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 3,500 షేర్లను కొన్నాడు. ఆ సమయంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ కంపెనీ జాబితా చేయని కంపెనీగా ఉండేది. అయినప్పటికీ బాబు 2.8 శాతం వాటాదారుగా మారారు. సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ పీపీ సింఘాల్, బాబు స్నేహితులు. ఏటేటా డివిడెండ్ చెల్లించకపోవడంతో బాబు ఈ పెట్టుబడుల గురించి మరచిపోయాడు. 2015 లో పెట్టుబడుల విషయం బయటపడటంతో.. బాబు దీని గురించి పూర్తి సమాచారం సేకరించాడు. కంపెనీ తన పేరును పీఐ ఇండస్ట్రీస్గా మార్చి లిస్టెడ్ కంపెనీగా అవతరించిందని తెలుసుకున్న బాబు.. తన వాటాలను డీమ్యాట్ ఖాతాకు మార్చుకునేందుకు ప్రయత్నించగా నేరుగా కంపెనీని సంప్రదించాలని ఓ ఏజెన్సీ సూచించింది. కంపెనీని సంప్రదించగా బాబు షేర్ హోల్డర్ కాదని, 1989 లో అతడి షేర్లు మరొకరికి అమ్మేసినట్లు కంపెనీ తెలిపింది.
డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్లను ఉపయోగించి పీఐ ఇండస్ట్రీస్ తన షేర్లను మరొకరికి విక్రయించిందని బాబు ఆరోపించారు. 2016 లో పీఐ ఇండస్ట్రీస్ మధ్యవర్తిత్వం కోసం బాబును ఢిల్లీకి పిలిచింది. దీనికి బాబు నిరాకరించడంతో.. బాబు పత్రాలను పరిశీలించడానికి కంపెనీ ఇద్దరు సీనియర్ అధికారులను కేరళకు పంపింది. బాబు వద్ద ఉన్న పత్రాలు నిజమైనవని కంపెనీ అంగీకరించింది. కానీ, తదనంతరం ఎటువంటి చర్య తీసుకోలేదు. దాంతో తనకు న్యాయం చేయాలంటూ బాబు సెబీకి ఫిర్యాదు చేశారు. సెబీ నుంచి తనకు ఖచ్చితంగా న్యాయం లభించి రూ.1,448 కోట్లు తనకు అందుతాయని బాబు జార్జ్ వాలవి కుమారుడు జార్జ్ కే వాలవి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..