Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితులుగా పేరు తెచ్చుకున్నవారు కూడా ఆ పార్టీని వీడుతున్నారు.
దీంతో టీఎంసీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో మమతా బెనర్జీ.. సోనియా గాంధీతో భేటీ ఢిల్లీలోని ఆమె నివాసంలో అయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్ రాజకీయాలతోపాటు, జాతీయ రాజకీయాలపై కూడా చర్చ జరిగింది. బీజేపీ వరుస విజయాలు, బెంగాల్లో బీజేపీ నేతల ఒత్తిడి కారణంగా టీఎంసీ నేతలు పార్టీని వీడుతున్నారని మమత.. సోనియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. మమతకు ఒక కీలక సూచన చేశారు. టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆమె మమతను కోరారు. అయితే, దీనిపై మమత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం కొంత సమయాన్ని మమత కోరారు.
కొన్ని రోజుల తర్వాత తన నిర్ణయాన్ని చెబుతానని మమత సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై సోనియా, మమత సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే, నాయకత్వంపై మమత సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమత హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమితో కలిసి పని చేసేందుకు టీఎంసీ సిద్ధంగా ఉంది. త్వరలోనే టీఎంసీ.. కాంగ్రెస్లో విలీనం కావడంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.