న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీచేస్తున్నాయి. టెక్ మహీంద్రాలో ఈ నెల నుంచే నూటికి నూరు శాతం ఉద్యోగులు ఆఫీస్కు వెళ్తున్నారు. టీసీఎస్, ఆర్పీజీ గ్రూప్, జెన్సర్ వంటి కంపెనీల్లో క్రమంగా వర్క్ ఫ్రమ్ హోంను ఎత్తేస్తున్నారు. టాటా మోటార్స్ కూడా ఇదే మార్గంలో వెళ్తున్నది. విప్రో తన ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటును కల్పించింది.
కొద్దికొద్దిగా ఆఫీస్కు అలవాటు..
కొవిడ్-19 కారణంగా మూడేండ్లుగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాయి. కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ అతలాకుతలం అయిన వేళ ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల భారీ రాజీనామాలు, రిటైర్మెంట్లు కూడా చోటుచేసుకొన్నాయి. తాజాగా ఐటీ కంపెనీల్లో గ్రేట్ రిటర్న్ (ఉద్యోగులు భారీగా ఆఫీస్లకు తిరిగి వెళ్లటం) నడుస్తున్నది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ దాదాపు ఇదే విధానంలో వెళ్తున్నాయి. ఆఫీస్కు వస్తారా? ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోతారా? అంటూ ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గోయెంకా ఇటీవలే తన ఉద్యోగులకు తుది హెచ్చరిక జారీ చేశారు. ‘ఉద్యోగులు వారంలో కొద్ది రోజులైనా ఆఫీసుకి రావాల్సిందే. వర్క్ ఫ్రమ్ హోం దీర్ఘకాలం లాభసాటి కాదు’ అని పేర్కొన్నారు.
టీసీఎస్ కూడా ఉద్యోగులు ఆఫీస్కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం 20 శాతం మందే ఆఫీస్కు వచ్చి పనిచేస్తున్నారు. మరింత మంది ఆఫీస్కు రావటం అత్యవసరమని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు. ఆర్పీజీ గ్రూప్ కంపెనీ జెన్సర్ టెక్నాలజీస్ కూడా ఉద్యోగులను ఆఫీస్లకు రావాలని ఆదేశించింది. సంస్థలో ప్రస్తుతం 10-20 శాతం మందే ఆఫీస్లో పనిచేస్తున్నారు. టాటా మోటార్స్లో ఇప్పటికే 65 శాతం మంది కంపెనీల్లో పనిచేస్తున్నారు. మిగతావారిని కూడా కనీసం వారంలో సగం రోజులైనా ఆఫీస్కు రావాలని ఆదేశించింది. విప్రో మాత్రం ఎక్కడి నుంచి పనిచేయాలన్న నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలేసింది.