Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలను గుప్పిస్తారు. వీటిని నమ్మిన ఓటర్లు అధికారాన్ని కట్టబెడతారు. అయితే, ఇచ్చిన హామీల అమలులో చివరకు చేతులెత్తేస్తారు. అయితే, ప్రజలేమీ అమాయకులు కాదు కదా! తమను వంచించిన వారికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారు. ఇదేదో పొలిటికల్ సినిమా స్టోరీ కాదు. కాంగ్రెస్ పార్టీ గురించే. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో గతంలో, ఇటీవల జరిగిన ఎన్నికలను లోతుగా విశ్లేషిస్తే అసలు తర్కం బోధపడుతుంది.
రాజస్థాన్లో స్కోర్ ‘సున్నా’
అది నవంబర్ 2018. రాజస్థాన్కు అసెంబ్లీ ఎన్నికల సమయం. అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ‘జన్ ఘోష్నా పత్ర’ పేరిట మ్యానిఫెస్టోలో గ్యారెంటీలను గుప్పించింది. రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, నిరుద్యోగులకు నెలకు రూ. 3,500 భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు, యువతులకు ఉచిత విద్య, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం తదితర హామీలను ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ను నమ్మిన ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అశోక్ గెహ్లాట్ సర్కారు మాటతప్పింది. ఉచిత విద్యుత్తు మాట అటుంచితే విద్యుత్తు చార్జీలను పెంచింది. రుణమాఫీని అటకెక్కించింది. రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం లక్ష మందికే అదీ ఒక్క నెల మాత్రమే నిరుద్యోగ భృతినిచ్చి చేతులు దులుపుకొన్నది. మిగతా హామీలను కూడా తుంగలో తొక్కింది. దీంతో మోసాన్ని గ్రహించిన ఓటర్లు.. ఆ తర్వాత ఐదు నెలల వ్యవధిలోనే 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ సీట్లలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్కు మద్దతు పలుకలేదు. దీంతో ఆ ఎన్నికల్లో హస్తంపార్టీ ఒక్క లోక్సభ సీటునూ గెలుచుకోలేదు. దీంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మళ్లీ గ్యారెంటీల కుట్రకు తెరతీసింది. అయితే, ఈసారి హస్తం పార్టీ మోసాన్ని గుర్తించిన ఓటర్లు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారాన్ని దూరంచేశారు.
ఛత్తీస్గఢ్లో ఇలా.. ఎంపీలో అలా..
2018లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ పై విధంగానే హామీలను గుప్పించింది. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, పేదలకు ఇండ్లు ఇలా పదుల సంఖ్యలో గ్యారెంటీలను ప్రకటించింది. దీంతో ఆ ఎన్నికల్లో ఇరు రాష్ర్టాల ప్రజలు పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే, అధికారంలోకి వచ్చాక, ఛత్తీస్గఢ్లోని బఘేల్ ప్రభుత్వం హామీల అమలును గాలికొదిలేసింది. మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభ నివారణకే పరిమితమైన కమల్నాథ్ సర్కారు ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టింది. దీంతో ఐదు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇరు రాష్ర్టాలకు కలిపి మొత్తం 40 సీట్లకు గానూ కాంగ్రెస్కు కేవలం మూడు సీట్లనే ఓటర్లు కట్టబెట్టారు. ఇక, 2019 లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం 4 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలువలేదు.
తెలంగాణ, కర్ణాటకలోనూ అనుమానమే!
ఐదు గ్యారెంటీల పేరిట అటు కర్ణాటకలో, ఆరు గ్యారెంటీలను ఆశగా చూపి ఇటు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకొన్న కాంగ్రెస్.. హామీల అమలులో మాత్రం చతికిలపడింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి పది నెలలైనా హామీల అమలు సంపూర్ణంగా జరుగట్లేదు. ఇటు తెలంగాణలోనూ పాలనాపగ్గాలు చేపట్టి 5 నెలలు అవుతున్నా ఒక్క గ్యారెంటీ కూడా సంపూర్ణంగా నెరవేరలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు హిమాచల్లోనూ ఇచ్చిన పది హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. దీంతో అధికార కాంగ్రెస్పై ఆయా రాష్ర్టాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్కు ఎంపీ సీట్లు రావడం కష్టమేనని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.