లక్నో : యూపీలో దారుణం జరిగింది. డియోరియాలో ఓ భూవివాదానికి (Land Dispute) సంబంధించి జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణతో పలు వాహనాలు ధ్వంసం కాగా, ఆ ప్రాంతం అల్లర్లతో అట్టుడికింది. రామ్శేష్ యాదవ్, శశిభూషణ్ చౌహాన్ల మధ్య చాలా ఏండ్లుగా భూవివాదం నెలకొంది.
ఈ క్రమంలో శశిభూషణ్ చౌహాన్ స్ధలం చుట్టూ ప్రహారీ కడుతుండటం వివాదానికి దారితీసింది. రామ్శేష్ యాదవ్ స్ధలానికి రిటైర్డ్ బీఎస్ఎఫ్ అధికారి చౌహాన్ ఇంటి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. యాదవ్ తన స్ధలంలో కొంత ఆక్రమించాడని చౌహాన్ ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య ఈ విషయమై వాదోపవాదాలు జరగ్గా చివరికి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ఆరుగురు మరణింంచగా ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఘర్షణల నేపధ్యంలో ఇరు వర్గాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Read More :