జమ్ము, మార్చి 16: రాజకీయ కక్ష సాధింపుల విషయంలో పొరుగు దేశం పాకిస్థాన్కు భిన్నంగా ఏమీ భారత్లో జరగడం లేదని, అలాంటి పరిస్థితులే ఇక్కడా కొనసాగుతున్నాయని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
గురువారం పార్టీ హెడ్క్వార్టర్స్లో మాట్లాడుతూ పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేయడానికి అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టే భారత్లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా విపక్షాలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని వేధింపులకు దిగుతున్నదని ఆమె విమర్శించారు. ‘ఇక్కడ ఇప్పటికే మనీశ్ సిసోడియా వంటి మంత్రిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై ఈడీ వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆమెకు సమన్లు జారీ అయ్యాయి. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబంపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే శివసేన, ఇతర పార్టీల నేతలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసింది’ అని పేర్కొన్నారు.