బెంగళూర్ : కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న బీజేపీపై కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కాషాయ పార్టీ చేపట్టిన ఆపరేషన్ కమలం కర్నాటకలో ఫలించదని అన్నారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ 40 కోట్లతో కాషాయ పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు తిప్పుకుంటోందనే వార్తలపై సిద్ధరామయ్య స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని బీజేపీ ప్రతి ఎమ్మెల్యేలను రూ 50 కోట్లతో కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని అన్నారు. గోవాలోనే కాదు ప్రతి చోటా వారు (బీజేపీ నేతలు) ఆపరేషన్ కమలానికి తెరలేపుతున్నారు. డబ్బు సంచులు ఎరవేసి ఎమ్మెల్యేలను కొంటున్నారని సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటకలో మాత్రం కమలం నాటకం ఫలించదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను రూ 40, రూ 50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధను విచ్చిన్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి చర్యలు దేశంలో చోటుచేసుకోవడం మనందరికీ సిగ్గు చేటని అన్నారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీ సహకారంతో పార్టీ ఎమ్మెల్యేలను కాషాయ గూటికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణపై గోవా అసెంబ్లీలో విపక్ష నేత, పార్టీ ఎమ్మెల్యే మైఖేల్ లోబోపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది.