బెంగళూర్ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ పేదల వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అమానవీయంగా వ్యవహరిస్తోందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. కర్నాటక ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సిద్ధరామయ్య దుయ్యబట్టారు.
తాను సీఎం పగ్గాలు చేపట్టిన వెంటనే అన్న భాగ్య పధకానికి బియ్యం సరఫరా చేయాలని కోరుతూ ఎఫ్సీఐకి లేఖ రాయగా బియ్యం సరఫరాలకు ఎఫ్సీఐ అంగీకరించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడిందని సీఎం ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని వెల్లడైందని అన్నారు. తాము బియ్యం ఉచితంగా పంపమని కోరలేదని, బియ్యం సరఫరాలకు డబ్బు చెల్లించేందుకు సిద్ధపడ్డామని చెప్పారు.
కిలోకు రూ. 36 చెల్లించేందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేయగా ముందు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆపై వెనుకడుగు వేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో నెలకు 5 కిలోల పైగా ఉచిత బియ్యం ఇచ్చానని, అయితే బీజేపీ ఉచిత బియ్యాన్ని 5 కిలోలకు తగ్గించిందని అన్నారు. తమకు బియ్యం సరఫరా చేసేందుకు ఎఫ్సీఐ అంగీకరించినా బీజేపీ పాలకులు నిరాకరించారని దుయ్యబట్టారు.
Read More :