హైదరాబాద్: నగరంలో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.3 లక్షల విలువ చేసే ఈ-సిగరెట్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాధవ్ అనే వ్యక్తి కోల్కతా (Kolkata), ముంబై (Mumbai) నుంచి కొరియర్ (Courier) ద్వారా సిగరెట్లను తెప్పిస్తున్నాడని, వాటిని నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులకు (College students) విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
అయితే పంజాగుట్టలోని అమిటీ కళాశాలకు చెందిన అచ్యుత గౌతమ్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. అరెస్టయిన వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.